హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన జవాన్‌ పబ్బాల అనిల్‌ అంత్యక్రియలు పూర్తి

జమ్ము కశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్‌ గ్రామానికి చెందిన జవాన్‌ పబ్బాల అనిల్‌(30) గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. శనివారం అనిల్ భౌతికకాయానికి ఆర్మీ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, శ్రేయోభిలాషులు పబ్బాల అనిల్ కు కన్నీటి వీడ్కోలు పలికారు.

అనిల్ భౌతికఖాయానికి మంత్రి గంగుల కమలాకర్, బీజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ నివాళులు అర్పించారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించారు. అనిల్ అంతిమయాత్ర జనసంద్రమైంది. గ్రామస్తులతో పాటు..పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని అనిల్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జై జవాన్ నినాదాలతో మల్కాపూర్ మార్మోగిపోయింది.

గురువారం కిస్త్వార్‌ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్న తేలికపాటి హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. ఆ ముగ్గురిలో అనిల్‌ మృతి చెందగా ఇద్దరికి గాయాలైనట్టు తెలిసింది. మలాపూర్‌ గ్రామానికి చెందిన పబ్బాల లక్ష్మి-మల్లయ్యకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు అనిల్‌ 2011లో సైన్యంలో చేరి టెక్నికల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. అనిల్‌కు భార్య సౌజన్య, కొడుకులు ఆయాన్‌, అరవ్‌ ఉన్నారు.