శశిధర్ రెడ్డి పార్టీ మార్పుపై జగ్గారెడ్డి కామెంట్స్

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి..కాంగ్రెస్ ను వీడి బిజెపి లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలో జెపి నడ్డా సమక్షంలో అయన బిజెపి కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలో శశిధర్ పార్టీ మార్పు ఫై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. శశిధర్ రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్‌కు నష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే దానికి పూర్తి బాధ్యత టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలదేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

తమ పార్టీలో ఇబ్బంది ఉందని, పీసీసీ, సీఎల్పీ సమన్వయం చేయాలని సూచించారు. ఈ సందర్బంగా రేవంత్ ఫై కూడా జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పాదయాత్రలో వన్‌మ్యాన్ షో చేస్తే ఎలా? అంటూ రేవంత్‌ను ఉద్దేశించి సీరియస్ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లను సమన్వయం చేయకపోవడం పీసీసీ తప్పేనని వ్యాఖ్యానించారు. మరోపక్క తనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరుతారని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయమయ్యే పరిస్థితి ఇప్పుడు లేదని శశిధర్ ఆరోపించారు.