భారత ఉప రాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్కర్‌ విజయం

భారత ఉప రాష్ట్రపతి గా జగ్‌దీప్‌ ధన్కర్‌ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్కరెట్‌ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇవాళ ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తరఫున ఎన్నికల బరిలో నిలిచిన జగదీప్‌ ధన్కర్‌కు 528 ఓట్లు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు 182 ఓట్లు పోలయ్యాయి. 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. ధన్‌కర్‌ గెలుపును లోక్‌‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్ అధికారికంగా ప్రకటించారు‌. ఈ ఎన్నికలో పార్లమెంట్‍‌కు చెందిన 725 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరో ఎనిమిది ఎంపీ స్థానాలు ఖాళీగా ఉండటంతో ఓటింగ్‌కు అవకాశం లేకుండా పోయింది.

జగదీప్ ధన్‌కర్‌ గెలుపుతో ఆయన స్వస్థలమైన రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌లో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. 1951లో జన్మించిన జగదీప్ ధన్‌కర్‌, లా పూర్తి చేసి న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత 1989లో రాజకీయాల్లో చేరారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఉప రాష్ట్రపతి పదవి దేశంలో రెండో అతిపెద్ద పదవి. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈ నెల 10న ముగుస్తుంది. 16వ ఉప రాష్ట్రపతిగా ఈ నెల 11న జగదీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం చేస్తారు.