కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసిన సీఎం జగన్

కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్ బుధువారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ సహకారంతో వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఈ స్టీల్‌ప్లాంట్‌ ను నిర్మిస్తుంది. స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజ అనంతరం సీఎం జగన్ ప్లాంట్‌ నిర్మాణ నమూనాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ వెంట జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్, మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్‌ భాషా, గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

అంతకు ముందు సీఎం జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైస్సార్సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ సహకారంతో సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ రూ.8,800 కోట్లతో కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరగనుంది. లీజు ప్రాతిపదికన జేఎస్‌డబ్ల్యూ సంస్థకు 3500 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. తొలి విడతలో రూ.3.300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి.. రెండో విడతలో మరో 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంలో ప్లాంట్‌ విస్తరణ చేపట్టనున్నారు. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. 36 నెలల్లో తొలిదశ యూనిట్‌ అందుబాటులోకి తేవాలని లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో 25 వేల మందికి ప్రత్యేకంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.