బీసీలను రాష్ట్రానికి వెన్నెముకగా గుర్తించిన ఏకైక సిఎం జగన్: మంత్రి రోజా
బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూశారన్న రోజా
అమరావతిః విజయవాడలో వైఎస్ఆర్సిపి నిర్వహించనున్న బీసీ మహాసభకు సంబంధించిన పోస్టర్ ను నగరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రి రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తన భర్త సెల్వమణి బీసీ సామాజికవర్గానికి చెందినవారని… తాను బీసీ ఇంటి కోడలినని అన్నారు. బీసీలను టిడిపి అధినేత చంద్రబాబు పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని ఆమె విమర్శించారు.
బీసీలను వెనుకబడినవారిగా కాకుండా… రాష్ట్రానికే వెన్నెముకగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. 139 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత జగన్ దని అన్నారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందని చెప్పారు. విజయవాడలో నిర్వహించే బీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. బీసీలను ఓటు బ్యాంకుగా భావించే చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/