జగన్ కు ఓటమి భయం పట్టుకుందిః దేవినేని ఉమా
అరాచకాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్య
అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఓటమి భయం పట్టుకుందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు చంద్రబాబును జైల్లోనే ఉంచాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ వాతావరణంలో పెరిగిన జగన్ అండతో వైఎస్ఆర్సిపి శ్రేణులు పేట్రేగి పోతున్నాయని, బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నాయని అన్నారు. టిడిపి కార్యకర్తలపై 60 వేల అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. మీ తప్పుడు కేసులు, అరెస్టులకు టిడిపి నేతలు భయపడబోరని అన్నారు. మీ అరాచకాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.