బద్రీనాథ్ ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రార్థనలు

President Droupadi Murmu Offers Prayers At Badrinath Temple In Uttarakhand

న్యూఢిల్లీః రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లాలోని బద్రినాథ్‌ ఆలయాన్నిసందర్శించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ గుర్మిత్‌ సింగ్‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి, బద్రినాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ చైర్మన్‌ అజేంద్ర అజయ్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో రాష్ట్రపతి 25 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ అజయ్‌.. రాష్ట్రపతికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక సీఎం ధామీ ఆలయ ప్రతిరూపాన్ని బహూకరించారు. ఆలయ సందర్శన అనంతరం రాష్ట్రపతి శ్రీనగర్‌ బయలుదేరి వెళ్లారు. అక్కడ హెచ్‌ఎన్‌బీ గర్వాల్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.