నేడు భీమిలిలో ‘సిద్ధం’ పేరుతో జగన్‌ భారీ బహిరంగ సభ

వేదికతో పాటు పెద్ద ర్యాంప్ ఏర్పాటు

Jagan held a huge public meeting in Bheemili today under the name of ‘Siddham’

అమరావతిః ఏపీ సిఎం జగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపువలసలో ‘సిద్ధం’ పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సభ ప్రారంభంకానుంది. గత సభలకు భిన్నంగా ఈ సభను నిర్వహించబోతున్నారు. సభా వేదిక మాత్రమే కాకుండా… పెద్ద ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్ మీద నడుచుకుంటూ కార్యకర్తల్లోకి వెళ్లి, వారితో జగన్ మమేకమవుతారు. పార్టీ కేడర్ అభిప్రాయాలను స్వయంగా తెలుసుకుంటారు.

ఈ సభలో తన పాలనలో జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని జగన్ వివరించనున్నారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పి కొట్టాలో కేడర్ కు తెలియజేయనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే ఈ ‘సిద్ధం’ సభ లక్ష్యం. ఎన్నికలకు కేడర్ ను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా నిర్వహించబోతున్న ‘సిద్ధం’ సభలు భీమిలి సభతో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సభలను నిర్వహిస్తున్నారు.