హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండలా మారాయిః జగదీశ్ రెడ్డి

బిఆర్ఎస్‌ను రద్దు చేస్తే ప్రశ్నించే వారు ఉండరనేది వారి ఉద్దేశ్యమని వ్యాఖ్య

jagadeesh reddy
jagadeesh reddy

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ గుర్తును రద్దు చేయాలన్న కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుపై జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇచ్చిన హామీలు గుదిబండలా మారాయని కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని విమర్శించారు. శుక్రవారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని నడపలేక బిఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు లేఖలు రాస్తున్నారని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని… ఈ విషయాన్ని తాము ముందే చెప్పామన్నారు. హామీలను అమలు చేయకుంటే ప్రజలే మిమ్మల్ని రద్దు చేస్తారని హెచ్చరించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని తాము అడుగుతుంటే… బిఆర్ఎస్ పార్టీని రద్దు చేయమని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్‌ను రద్దు చేస్తే తమని ప్రశ్నించే వారు ఉండరనేదే వారి ఉద్దేశం అన్నారు. తాము 420 గాళ్లమని వాళ్లకు వాళ్లే చెప్పుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ ప్రారంభమైందని… ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు.

పథకాల అమలుకు ప్రభుత్వంగా సమయం తీసుకుంటే తప్పులేదు కానీ, ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయాలని చూస్తే సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. తెలిసీ.. తెలియక ఇచ్చిన హామీలు అధికార పార్టీకి గుదిబండలా మారాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అక్షరాలా 420 ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. హామీల గురించి ప్రజలకు చెప్పే బాధ్యత.. ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. పరిపాలన చేతకాకుంటే అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు తీసుకొని ముందుకు సాగాలని హితవు పలికారు.