కశ్మీర్లో భారీగా కురుస్తోన్న మంచు..సోనామార్గ్ రహదారి మూసివేత
న్యూఢిల్లీః కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో కశ్మీర్లోని పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. సెంట్రల్ కాశ్మీర్ లోని గందర్బాల్ జిల్లాలో జోజిలా ఎగువ ప్రాంతాలు హిమపాతంతో నిండిపోయాయి. భారీగా మంచు కురుస్తుండటంతో సోనామార్గ్-జోజిలా రహదారిని అధికారులు మూసివేశారు. మరోవైపు జమ్ము కశ్మీర్తోపాటు హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ – స్పితి ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కనుచూపు మేర శ్వేత వర్ణం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. శీతాకాలం ప్రారంభం నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ భారీగా మంచు కురుస్తోంది.