కావాలనే దాడులు చేశారుః బిఆర్ఎస్ ఎమ్మెల్యే

అధికారులకు అన్నివిధాలుగా సహకరించినట్లు వెల్లడి

it-raids-completed-in-brs-mla-shekar-reddy-house

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ నేతలపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడుల్లో భాగంగానే తన నివాసంలో ఐటీ సోదాలు జరిగాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మండిపడ్డారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని ఆరోపించారు. తన నివాసానికి వచ్చిన గంటన్నరలోపే అధికారులకు అన్ని వివరాలు అందజేశామని, అయినా మూడు రోజుల పాటు హంగామా చేశారని విమర్శించారు. కాగా, ఎమ్మెల్యే పైళ్ల నివాసంలో మూడు రోజుల పాటు కొనసాగిన ఐటీ దాడులు శనివారం ఉదయం ముగిశాయి. మంగళవారం విచారణకు రమ్మంటూ పైళ్ల శేఖర్ రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఐటీ దాడులు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఐటీ అధికారులపై విమర్శలు చేశారు. ఏదో ఊహించుకుని వచ్చిన అధికారులకు తన ఇంట్లో ఏమీ దొరకలేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు. తనకు రియల్ ఎస్టేట్, డెవలపింగ్ తప్ప వేరే ఏ వ్యాపారాలు లేవని ఎమ్మెల్యే చెప్పారు. తాను కొన్న ఆస్తుల వివరాలను అడగడంతో పాటు బ్యాంక్ లాకర్లను తెరిపించి చూశారని చెప్పారు. మంగళవారం విచారణకు రమ్మంటూ నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చెప్పారు.

ఈ సోదాల్లో ఎమ్మెల్యేకు సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన ఆడిటర్లు వారి ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. కంపెనీల వ్యాపార వ్యవహారాలు, చెల్లిస్తోన్న పన్నులకు మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించినట్లు సమాచారం. పైళ్ల శేఖర్‌ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్‌ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా అధికారులు పరిశీలించారు.

వనితా రెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అనధికారిక వర్గాల సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను తెరిపించి పరిశీలించారని, కీలక డాక్యుమెంట్లతో పాటు విలువైన ఆభరణాలను అధికారులు గుర్తించారని ప్రచారం జరుగుతోంది.