గవర్నర్ తమిళసై తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు.యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లుపై చర్చించేందుకు మంత్రి సబితా ను రాజ్ భవన్ కు ఆహ్వానించడం తో సబితా వెళ్లడం జరిగింది. రాజ్ భవన్లో జరిగే ఈ భేటీలో ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొననున్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు ఉన్న సందేహాలను సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేయనున్నారు. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై న్యాయపరమైన అన్ని అంశాలను గవర్నర్కు వివరించనున్నారు.
కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై సందేహాలున్నాయంటూ గవర్నర్ తమిళి సై రెండు రోజుల క్రితం ప్రభుత్వంతో పాటు యూజీసీకీ లేఖ రాశారు. తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు 2022 బిల్లుపై చర్చించేందుకు రావాలని విద్యాశాఖ మంత్రికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాశారు. అయితే ఈ విషయమై నాలుగైదు రోజులుగా వివాదం సాగుతుంది. తమకు సమాచారం ఇవ్వలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అయితే సెప్టెంబర్లోనే మెసేంజర్ ద్వారా ఈ విషయమై సమాచారం పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.