మంత్రి గంగుల నివాసంలో ఐటీ, ఈడీ అధికారుల సోదాలు
గంగుల ఇంటితో పాటు ఆయనకు చెందిన గ్రానైట్ కంపెనీల్లో సోదాలు
హైదరాబాద్ః ఈరోజు ఉదయం తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ ఈ సంస్థల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లోని గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి మరీ అధికారులు ఆయన ఇంటిలోకి ప్రవేశించారట.
కరీంనగర్ లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మతోటలోని కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహావీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ ఎగుమతుల్లో భాగంగా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే తెలంగాణకు చెందిన 8 సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆదాయపన్ను శాఖ అధికారులతో కలిసి ఈడీ దాడులు చేస్తుండటం గమనార్హం. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికలు ముగిసినంతనే ఈ దాడులు జరుగుతుండటంపై పెద్ద చర్చే నడుస్తోంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/