గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ కి షాక్ ఇచ్చిన మహిళ

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని , ఆ ఇంటికి ప్రభుత్వ పధకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని నేతలకు ఆదేశించారు. ఎవరు ఈ కార్యక్రమానికి వెళ్లకపోయినా వచ్చే ఎన్నికల్లో టికెట్స్ ఇవ్వనని తేల్చి చెప్పారు. దీంతో ప్రతి ఒక్క నేత ప్రతి గడప తొక్కుతూ ప్రభుత్వ పధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చాలామందికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇంటి ముందు కు వచ్చిన చాలామంది నేతలను ప్రజలు నిలదీయడం చేస్తున్నారు. తాజాగా వల్లభనేని వంశీని సైతం స్థానికులు నిలదీశారు.

గన్నవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే విజయవాడ శివారు రామవరప్పాడులో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వంశీని ఉద్యోగావకాశాల కల్పనపై మహిళలు ప్రశ్నించారు. అందులో ఓ మహిళ గత ప్రభుత్వ హయాంలో ఇక్కడికి వచ్చిన కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం లేక వెళ్లిపోయాయని ..దీంతో యువత పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీనిపై జగన్ తో మాట్లాడాలని సదరు మహిళ కోరింది. దీంతో వంశీ సమాధానం చెపుతూ..చూడండి అక్కా.. మీరు ఆ రెండు పత్రికలు బాగా చూస్తున్నట్లున్నారు అన్నారు. దీంతో ఆ మహిళకు .. మీరు పెద్దవాళ్లు అయింది ఆ పత్రికల వల్లేగా అంటూ జవాబు ఇచ్చింది. దీంతో షాక్ కు గురైన వంశీ కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. అనంతరం ఐటీ కంపెనీలు వెళ్లిపోవడంపై వివరణ ఇచ్చారు. ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పనిచేయలేకపోవడంతో ఆయా కంపెనీలు వెళ్లిపోయాయంటూ చెప్పుకొచ్చారు.