సక్సెస్ ఫుల్ గా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ శాటిలైట్
తిరుపతి జిల్లాలో సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ మరో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. 10.42 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహక నౌక ద్వారా ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశ పెట్టారు. 27.30 గంటల సుదీర్ఘ కౌంట్ డౌన్ తర్వాత ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభమైంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి పంపారు.
జీఎస్ఎల్వీ-ఎఫ్12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులు. రాకెట్ బయలుదేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కి.మీ. ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూ భాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.