హైజాక్ అయిన నౌకలోని సిబ్బందిని రక్షించిన భారత నేవీ
న్యూఢిల్లీః ఆఫ్రికా దేశమైన సోమాలియా లో అరేబియా సముద్ర తీరంలో గురువారం ఓ కార్గో నౌక హైజాక్కు గురైన విషయం తెలిసిందే. లైబీరియా జెండాతో ఉన్న కార్గో నౌక ‘ఎంవీ లిలా నార్ఫోక్’లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. హైజాక్ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. సముద్ర గస్తీ విధుల్లో ఉన్న ఐఎన్ఎస్ చెన్నైతో సహా మరో పెట్రోలింగ్ ఎయిర్క్రాఫ్ట్తో రంగంలోకి దిగింది. హైజాక్ అయిన నౌకలోని సిబ్బందితో కాంటాక్ట్ అయ్యింది. అనంతరం నౌకను వదిలి వెళ్లిపోవాల్సిందిగా హైజాకర్లను హెచ్చరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రానికి హైజాక్ గురైన నౌక వద్దకు చేరుకుని.. అందులోని 15 మంది భారతీయులు సహా మొత్తం 21 మందిని సురక్షితంగా రక్షించారు. అధికారులు చేసిన ఈ సాహసానికి సంబంధించిన వీడియోను భారత నేవీ ఎక్స్లో పోస్టు చేసింది.
సోమాలియా తూర్పు అరేబియా సముద్ర తీరానికి 300 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలు ఈ మర్చంట్ నౌకను హైజాక్ చేశారు. ఇది బ్రెజిల్లోని పోర్ట్ డు అకో నుంచి బహ్రెయిన్లోని ఖలిఫా బిన్ సల్మాన్కు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నౌకలోకి ప్రవేశించిన ఆరుగురు సాయుధ దుండగులు హైజాక్ చేసినట్టు తెలుస్తున్నది. హైజాక్కు గురైన వెంటనే నౌక సంబంధిత సమాచారాన్ని యూకేఎంటీవో పోర్టల్కు పంపింది. తర్వాత వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీ అప్రమత్తం చేయడంతో భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. పెట్రోలింగ్ ఎయిర్క్రాఫ్ట్ పీ81, ప్రిడేటర్ డ్రోన్ల సాయంతో నౌకపై నిరంతర నిఘా పెట్టింది.