బ్రిటన్ గురుద్వారా వద్ద భారత దౌత్యవేత్తను అడ్డుకున్న ఖలిస్తానీలు
న్యూఢిల్లీః బ్రిటన్లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామికి చేదు అనుభవం ఎదురైంది. స్కాట్లాండ్లో గురుద్వారాలోకి ప్రవేశించకుండా కొందరు ఆయణ్ను అడ్డుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఖలిస్థానీ సానుభూతి నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ ఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
దొరైస్వామి.. అల్బర్ట్ డ్రైవ్లోని గ్లాస్గో గురుద్వారా కమిటీ సభ్యులతో సమావేశం కాబోతున్నారన్న విషయం తమకు ముందుగానే తెలిసిందని ఓ ఖలిస్థానీ సానుభూతిపరుడు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దొరస్వామి గురుద్వారా వద్దకు రాగానే బ్రిటన్లోని అతివాద సిక్కులు కొందరు ఆయన్ను అడ్డుకున్నారని తెలిపాయి. ‘గురుద్వారాకు మీకు ఆహ్వానం లేదు’ అని వారు దొరస్వామితో చెప్పారని సమాచారం. ఫలితంగా అక్కడ స్వల్ప ఘర్షణ జరిగిందని.. యూకేలో ఉన్న ఏ గురుద్వారా లోపలికీ భారతీయ అధికారులకు స్వాగతం ఉండదని చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
కాగా, హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో కెనడా, భారత్ మధ్య గత కొన్నాళ్ల నుంచి వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఘటన ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. గ్లాస్గోవ్లోని ఆల్బర్ట్ రోడ్డులో ఉన్న గురుద్వారా వద్దకు దొరైస్వామి చేరుకుంటున్న సమయంలో.. ఖలిస్తానీ కార్యకర్తలు అడ్డుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. హై కమీషనర్ కారు పార్కింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు.కారు డోర్ను ఓపెన్ చేసేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆ కారు గురుద్వారా వద్ద ఆగకుండానే వెళ్లిపోయింది. హై కమీషనర్ సెక్యూర్టీ విషయంలో జరిగిన జాప్యంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.