బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎప్పుడూ అనుకూలమే : ప్రధాని మోడీ
కొత్త అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ, యూఏఈలకు స్థానం
జొహాన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ నగరంలో రెండ్రోజుల పాటు జరిగిన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల సదస్సు ముగిసింది. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో స్పందించారు. 15వ వార్షిక బ్రిక్స్ సమావేశం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ కూటమిని మరింత విస్తరించాలన్న అభిప్రాయానికి ఆమోదం లభించిందని తెలిపారు. బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎల్లప్పుడూ అనుకూలమేనని మోడీ స్పష్టం చేశారు.
ఈ విస్తరణ వల్ల బ్రిక్స్ మరింత బలోపేతం అవుతుందని, ఎక్కువ ప్రభావవంతంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితోనే అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలను బ్రిక్స్ లోకి భారత్ ఆహ్వానిస్తోందని ప్రధాని మోడీ వివరించారు.