రేపటి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

టొకెన్ల జారీ ప్రారంభించిన టీటీడీ అధికారులు

Vaikunta Dwara Darshan in Tirumala from tomorrow

తిరుమలః తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి జనవరి 1 వరకూ భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతి, తిరుమలలోని మొత్తం 9 ప్రాంతాల్లోని 90 కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీ చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా భక్తులు పోటెత్తడంతో ముందుగానే టోకెన్ల జారీని మొదలుపెట్టారు. మొత్తం 4,23,500 టిక్కెట్లు జారీ చేయనున్నారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, పరిసరాల్లో అత్యవసర సమయాల కోసం అంబులెన్సులు ఏర్పాటు చేశారు. రేపు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శనివారం వేకువజామున 1.45 నుంచి వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభించనున్నారు.

విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్‌ కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తున్నారు.