ఏడు దేశాలకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతులకు కేంద్రం అనుమతి

నేపాల్, మలేషియా, కామెరూన్, పిలిప్పీన్స్ తదితర దేశాలకు ఎగుమతి

India allows export of over 1 mn tonnes of non-basmati rice to 7 countries

న్యూఢిల్లీః బాస్మతీయేతర బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేపాల్, కామెరూన్, కోట్ డి ఐవోయిర్, రిపబ్లిక్ ఆఫ్ గినియా, మలేషియా, పిలిప్పీన్స్, సీషెల్స్‌లకు బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని వివిధ పరిమాణాలలో ఎగుమతి చేయడానికి అనుమతించింది. ముఖ్యంగా, దేశీయంగా ధరలను అదుపు చేసేందుకు, దేశీయ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని జులై 20 నుండి బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతి నిషేధించబడింది.

ఏడు దేశాలకు 10,34,800 టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసుకోవచ్చునని, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ కింద వీటిని అనుమతిస్తున్నట్లు డీజీఎఫ్‌టీ తెలిపింది. పలు దేశాల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక అనుమతులను జారీ చేసింది. ఇంతకుముందు యూఏఈ, సింగపూర్‌లకు బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది.

గతవారం కేంద్ర ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎగుమతి సుంకాన్ని మార్చి 31, 2024 వరకు పొడిగించింది. పొట్టుతో పాక్షికంగా ఉడకబెట్టిన బియ్యాన్ని పారాబాయిల్డ్ రైస్ అంటారు. 2022 సెప్టెంబరులో భారత్ బ్రోకెన్ రైస్ ఎగుమతులను నిషేధించింది. వరి పంట కింద విస్తీర్ణం తగ్గడం వల్ల తక్కువ ఉత్పత్తి గురించి ఆందోళనల మధ్య పారాబాయిల్డ్ రైస్ మినహా బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. ఆ తర్వాత నవంబర్‌లో నిషేధాన్ని ఎత్తివేసింది.