రాజ్యసభ చైర్మెన్కు ఎంపీ రాఘవ క్షమాపణలు చెప్పాలిః
న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ చద్దా నిరవధికంగా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్కు ఆ ఎంపీ షరతులు లేకుండా క్షమాపణలు చెప్పాల్సిందే అని ఈరోజు సుప్రీంకోర్టు తెలిపింది. సెలెక్ట్ కమిటీ అంశం కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఒకవేళ ఎంపీ రాఘవ క్షమాపణలు చెబితే, అప్పుడు రాజ్యసభ చైర్మెన్ ఆ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టు వెల్లడించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆ కేసులో ఆదేశాలు జారీ చేసింది. దివాళీ సెలవులు తర్వాత ఈ అంశంపై అప్డేట్ ఇవ్వాలని కూడా అటార్నీ జనరల్ వెంకటరమణిని కోర్టు ఆదేశించింది.
రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్ను ఎంపీ రాఘవ చద్దా వ్యక్తిగతంగా కలుసుకోవాలని, ఆయనకు ఎటువంటి షరతులు లేకుండా క్షమాపణలు చెప్పాలని సీజేఐ తెలిపారు. ఆగస్టు 11వ తేదీ నుంచి రాఘవ చద్దాపై సస్పెన్షన్ అమలులో ఉన్నది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై తమ అనుమతి లేకుండా తీర్మానంపై తమ పేర్లను చేర్చాలని బీజేపీ ఎంపీలు ఎంపీ రాఘవపై ఫిర్యాదు చేశారు. ఆ బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ రాఘవ కోరారు. అయితే ఈ అంశాన్ని బిజెపి ఎంపీలు తప్పుపట్టారు. తమ ఆమోదం తెలిపినట్లు బిజెపి ఎంపీలపై రాఘవ పేర్కొన్నా.. ఆ ఎంపీలు మాత్రం అందుకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాఘవపై చైర్మెన్ సస్పెన్షన్ విధించారు. ప్రివిలేజ్ కమిటీ వద్ద ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
రాజ్యసభ చైర్మెన్కు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ రాఘవ కోర్టుకు వెల్లడించారు. నిరవధిక సస్పెన్షన్ను సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజ్యసభ రూల్స్, రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్స్ను ఉల్లంఘించినట్లు ఆయన తన అఫిడవిట్లో ఆరోపించారు. సస్పెన్షన్ వల్ల పలు కమిటీల మీటింగ్కు హాజరుకాలేకపోతున్నట్లు ఎంపీ కోర్టుకు తెలిపారు.