ఓటును సరైన పార్టీకి వేస్తే భవిష్యత్ సరైన పద్దతిలో ఉంటుంది: సిఎం కెసిఆర్‌

cm-kcr-speech-public-meeting-at-bhainsa

భైంసా: స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి రాలేదని సిఎం కెసిఆర్‌ అన్నారు. భైంసా సభలో కెసిఆర్‌ మాట్లాడారు. ‘‘ఎన్నికలు రాగానే ఎవరెవరో వస్తారు.. ఏవేవో చెప్తారు. ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మి మోసపోవద్దు. గుడ్డిగా ఓటు వేయొద్దు. పోటీ చేస్తున్న వ్యక్తి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ.. దాని చరిత్రను ప్రజలు చూడాలి. ప్రజల పట్ల పార్టీల దృక్పథం చూసి వివేకంతో ఓటు వేయాలి’’ అని కెసిఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

గోదావరి నదికి తెలంగాణలో పుస్కరాలు లేవు. తెలంగాణ ఉద్యమం సమయంలో తాను కొట్లాడితే.. తెలంగాణలో గోదావరి పుష్కరాలు వచ్చాయని కెసిఆర్‌ తెలిపారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా నా మాట నమ్మండి. ఓటును సరైన పార్టీకి వేస్తే భవిష్యత్ సరైన పద్దతిలో ఉంటుంది. అనవసరంగా ప్రతిపక్షాల మాయలో ఓటర్లు పడొద్దు. ప్రజలు పార్టీల చరిత్ర చూడాలి. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని తెలిపారు. మేము చేసిన అభివృద్ధి కంటికి కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా అబద్దాలు, గాలి మాటలు చెబుతున్నాయి. ప్రజలను ఆగమాగం చేయాలని చూస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరో ప్రజలు పరిశీలించాలని సూచించారు.

మహారాష్ట్ర రైతులు తెలంగాణలో బోర్లు వేసి మహారాష్ట్రలో పంటలు పండిస్తున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ ఎంత దూరం ఉందంటే.. ఎక్కడ రోడ్డు నున్నగా ఉందో.. అక్కడి నుంచే తెలంగాణ అని చెబుతుంటారు. ఇటు మహారాష్ట్ర అయినా.. అటు ఆంధ్రప్రదేశ్ అయినా అదే పరిస్థితి. తెలంగాణ బాగుపడాలంటే బిఆర్ఎస్ కి ఓటు వేయాలని కెసిఆర్‌కోరారు.