ఉప్పల్ స్టేడియం లో నేడే తొలి సమరం..

ఉప్పల్ స్టేడియం వేదికగా నేటి నుంచి భారత్-ఇంగ్లండ్జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. స్పిన్ బౌలింగే ప్రధాన ఆయుధంగా ఈ మ్యాచ్లో బోణి కొట్టాలని టీమ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ‘బజ్ బాల్’ వ్యూహంతో చరిత్రను తిరగరాయాలని ఇంగ్లిష్ జట్టు ప్రణాళికలు చేస్తోంది. ఐదేళ్ల తర్వాత ఈ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా గణాంకాలు భారత్ కు అనుకూలంగా ఉన్నాయి. బజ్‌బాల్‌కు దీటుగా స్పిన్‌ వ్యూహాన్ని రచించేందుకు చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌శర్మ పక్కా ప్రణాళికతో ఉన్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ప్రతీ మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో భారత్‌, ఇంగ్లండ్‌ గెలుపు కోసం కడదాకా ప్రయత్నించే అవకాశముంది. బలబలాల పరంగా రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా..సొంతగడ్డపై ఆడటం భారత్‌కు అదనపు బలం కానుంది.

మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఉప్పల్‌ స్టేడియాన్ని కొత్త హంగులతో ముస్తాబు చేశారు. ఐదు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన బధ్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా మైదానం లోపల, బయట సీసీ కెమరాలతో గట్టి నిఘా ఉంచారు. పాఠశాల విద్యార్థులు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగుల కుటుంబాలు మ్యాచ్‌ను ఉచితంగా చూసే అవకాశాలను హెచ్‌సీఏ కల్పించింది. కాగా మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.