బీబీసీ కార్యాలయంలో ఐటీ సోదాలు

ముంబయిః బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేష‌న్‌(బీబీసీ)పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో ఉన్న బీబీసీ కార్యాల‌యాల్లో ఇవాళ ఐటీ శాఖ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ ట్యాక్సేష‌న్‌, ట్రాన్స్‌ఫ‌ర్ ప్రైసింగ్‌లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు బీబీసీపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో బీబీసీపై ఐటీశాఖ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు కొన్ని వ‌ర్గాలు ద్వారా తెలిసింది. కొంద‌రు జ‌ర్న‌లిస్టుల ఫోన్ల‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తామేమీ సోదాలు చేయ‌డం లేద‌ని, కానీ స‌ర్వే చేస్తున్న‌ట్లు కొంద‌రు ఐటీశాఖ అధికారులు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. అకౌంట్ బుక్స్‌ను చెక్ చేస్తున్నామ‌ని, త‌నిఖీలు నిర్వ‌హించ‌డంలేద‌న్నారు. సిబ్బంది బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌ద్దు అని అధికారులు ఆదేశించారు.

ఇటీవ‌ల గోద్రా అల్ల‌ర్లపై బీబీసీ ఛాన‌ల్ ఓ డాక్యుమెంట‌రీని రిలీజ్‌చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ డాక్యుమెంట‌రీపై పెను దుమారం చెల‌రేగింది. ఈ నేప‌థ్యంలోనే క‌క్ష్య సాధింపుగా ఆ సంస్థ‌పై ఐటీ దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్లు కూడా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంట‌రీని ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం బ్యాన్ చేసింది. సోష‌ల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల్లో ఆ డాక్యుమెంట‌రీని నిషేధించారు. రెండు భాగాలు ఉన్న ఆ డాక్యుమెంట‌రీని యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌లో బ్యాన్ చేశారు. కానీ కొన్నికాలేజీలు, వ‌ర్సిటీల్లో ఆ డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించారు.