వారణాసిలో నేడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబించేలా స్టేడియం
వారణాసిః దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని గంజారిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోబోతోంది. తన పార్లమెంటు నియోజకవర్గమైన ఇక్కడ స్టేడియం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మహిళా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడతారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు మోదీ వారణాసి చేరుకుంటారు. కొత్తగా నిర్మించిన 16 అటల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రారంభిస్తారు. క్రికెట్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్వి జై షా హాజరవుతారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్, లక్నోలో ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. ఇది మూడోది కానుంది.
క్రికెట్ స్టేడియం విశేషాలు..
- స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమి కోసం రూ. 121 కోట్లు ఖర్చు చేశారు.
- నిర్మాణానికి దాదాపు రూ.330 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- స్టేడియం సీట్ల సామర్థ్యం 30 వేలు
- స్టేడియంపైకప్పు అర్ధ చంద్రాకారంలో, ఫ్లడ్లైట్లు త్రిశూలం, కొన్ని నమూనాలను బిల్వ పత్రాలను పోలి వుండేలా నిర్మించనున్నారు. అలాగే, ఓ నిర్మాణాన్ని డమరుకం ఆకారంలోఉండనుంది.
- మొత్తంగా ఈ స్టేడియం కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబిస్తుంది.
- డిసెంబరు 2025 నాటికి పూర్తవుతుంది.