ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు

ఏపీ ఐసెట్, ఈసెట్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేసారు. ఐసెట్‌ ఫలితాల్లో 34,789(91.27శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని , ఈసెట్‌ ఫలితాల్లో 29,904 (92.53శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో ఐసెట్‌, 19న ఈసెట్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రెంటు సెట్లలో ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదైంది.

జేఎన్‌టీయూ(ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్‌ ఫలితాల వెల్లడి కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి హాజరు అయ్యారు. ఏపీఈసెట్‌కు మొత్తం 32,318 మంది విద్యార్థులు హాజరు కాగా, మొత్తం 13 బ్రాంచులకు గాను పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించారు.