కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ !

15 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తారన్న సన్నిహితులు

చండీఘడ్: మరి కొద్ది నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమరీందర్ కొత్త పార్టీ ఏర్పాటు కోసం తన మద్ధతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 12 మంది కాంగ్రెస్ నాయకులు అమరీందర్ సింగ్ తో టచ్ లో ఉన్నారని సమాచారం. అమరీందర్ పెట్టబోయే కొత్త పార్టీలో అతని మద్ధతుదారులైన కాంగ్రెస్ నేతలు చేరతారని అంటున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల కొందరు రైతు సంఘం నాయకులను కూడా కలిసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.పంజాబ్ ముఖ్యమంత్రిగా నిష్క్రమించిన తర్వాత ఆయన బీజేపీలో చేరడంపై ఊహాగానాలు చెలరేగాయి.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైఖరితో విసిగిపోయిన అమరీందర్ సింగ్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన అమరీందర్ ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌లతో భేటీ అయ్యారు. తాను బీజేపీలో చేరడం లేదని, కానీ కాంగ్రెస్‌తో కూడా కలిసి ఉండడం లేదని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.తాను ఇకపై కాంగ్రెస్ పార్టీలో భాగం కాదని, రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ గెలవకుండా చూసుకుంటానని కూడా చెప్పారు.వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన తాజా రాజకీయ పరిణామాలతో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/