ఫ్రీ హలీమ్ ఆఫర్‌కు పోటెత్తిన జనాలు..రంగంలోకి దిగిన పోలీసులు

ప్రస్తుతం ప్రజలంతా ఫ్రీ కి అలవాటుపడ్డారు. ప్రభుత్వాలు అన్ని ఫ్రీ గా ఇస్తుంటే..ఫ్రీ భోజనాలు సైతం ఎక్కడ దొరుకుతాయా అని వెతకడం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ప్రాంతంలోని అజీబో ముఖారీ మండీ హోటల్‌ యాజమాన్యం రంజాన్ మాసం సందర్బంగా ఫ్రీ హలీమ్ అని బోర్డు పెట్టారు. దీంతో జనాలు పోటెత్తారు.

రంజాన్ మాసం తొలి రోజున గంట పాటు ఉచిత హలీమ్ ఇస్తామంటూ హోటల్ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. దీంతో, ఆ సాయంత్రం కస్టమర్లు హోటల్‌కు ఒక్కసారిగా పోటెత్తడంతో వారిని నియంత్రించడం యాజమాన్యం వల్ల కాలేదు. దీంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. రద్దీ భారీగా ఉండటంతో జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు బాటన్ చార్జ్ చేయాల్సి వచ్చింది.

ఉచిత ఆఫర్‌కు సంబంధించి హోటల్ యాజమాన్యం తమ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. న్యూసెన్స్ సృష్టించడం, ట్రాఫిక్ జాంకు కారణమైనందుకు హోటల్ నిర్వాహకులపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.