మోహదీపట్నం అంకుర హాస్పటల్ లో ఘోర అగ్నిప్రమాదం

హైదరాబాద్ మహానగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాద వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా శనివారం సాయంత్రం మెహదీపట్నంలోని అంకుర హాస్పటల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక జ్యోతినగర్‌ ప్రాంతంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలోని పిల్లర్‌ నెంబర్‌ 68 దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఐదోఫ్లోర్‌ నుంచి పదో ఫ్లోర్‌ వరకు మంటలు అంటుకున్నాయి. పైనుంచి అగ్నికీలలు కిందపడుతున్నాయి. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదు. ఆసుపత్రిలో ఎక్కువగా గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. మంటలను గమనించిన హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లను వెంటనే బయటకు పంపారు. హాస్పిటల్‌ నేమ్‌ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. బోర్డు పక్కనే ఫ్లెక్సీలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం అధికారులు , పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.