ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు తీపి కబురు అందించారు. వీరి కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించబోతున్నట్లు హామీ ఇచ్చారు. అంతే కాదు 4 నెలల కిందట హైదరాబాద్ లో కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందిన స్విగ్గి డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం సహాయనిది కింద రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు.

శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. వారు లేవనెత్తిన అంశాలనుం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సామాజిక రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని శ్రీ రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.