ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన సీఎం జగన్
విశాఖపట్నం : సీఎం జగన్ నవరత్నాల్లో భాగంగా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్లో నిర్మించిన మోడల్ హౌస్ను పరిశీలించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25లక్షల మందికి ఇల్లు కట్టి ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో 17వేల జగనన్న కాలనీలు వస్తున్నాయని, రెండో దశ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ మంచి పనికి పదహారు నెలల కిందటే అడుగులు వేశాం. కానీ, మన ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో కొందరు రగిలిపోతున్నారు. మన పాలనకు, నాకు ఎక్కడ మంచి పేరు దక్కుతుందోనేమోనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఇప్పటికి కల సాకారమైంది. కోర్టు వ్యవహారాలు పూర్తికావడానికి సుమారు 489 రోజులు పట్టిందని.. ఈ కార్యక్రమం కోసం ఎప్పటికప్పుడు ఏజీతో చర్చిస్తూ వచ్చామని ఆయన అన్నారు. దేవుడి దయ వల్ల సమస్య తీరిపోయి.. లక్షల మందికి మేలు చేసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంద ని సీఎం జగన్ అన్నారు.
ఈ ఒక్కకాలనీలోనే దాదాపుగా 10,228 ప్లాట్లు ఇళ్ల నిర్మాణం జరగబోతోందని, పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వమే భరిస్తోందని సీఎం జగన్ చెప్పారు. ‘‘ఇళ్లు అనేది ఒక శాశ్వత చిరునామా. తర్వాతి తరానికి ఇచ్చే ఆస్తి. అలాంటి ఇళ్లను ఇవ్వడం ద్వారా ఒక సామాజిక హోదా కల్పించినట్లు అవుతుంది. స్థలం, ఇళ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు.. మొత్తం కలిపి అక్షరాల పదిలక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ఒక అన్నగా, తమ్ముడిగా అక్కాచెల్లెమ్మల తరపున భరించే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు’’ అంటూ సీఎం జగన్ తెలియజేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/