తెలంగాణ రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపిస్తున్న కోకాపేట భూములు

కోకాపేట ప్రభుత్వ భూములు..తెలంగాణ రాష్ట్ర ఖజానా నింపుతున్నాయి. కోకాపేటలోని నియో పోలిస్ ఫేజ్‌-2లో ప్రభుత్వ భూములను వేలం కొనసాగుతుంది. 10వ నెంబర్​ ప్లాట్​కి సంబంధించిన వేలంలో ఎకరా 100 కోట్ల మార్క్​ని టచ్​చేసింది. ఇప్పటివరకైతే ఇదే ఆల్​టైమ్​ రికార్డు ధరగా నమోదయినట్టు తెలుస్తోంది.

ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 72 కోట్లు.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. అయితే ఈరోజు ఉదయం తొలి విడతలో చేపట్టిన 6,7,8,9 ఫ్లాట్ల వేలం ముగియగా.. ఫ్లాట్లు అంచనాలకు మించి ధర పలికాయి. నాలుగు ప్లాట్ల వేలంలో అత్యధికంగా ఒక ఎకరం దాదాపు రూ. 72 కోట్లు పలకగా.. అత్యల్పంగా రూ. 51 కోట్లు పలికింది. గజం సరాసరి రూ. 1.5 లక్షలు పలికింది. మొత్తంగా నాలుగు ప్లాట్ల వేలంలో హెచ్‌ఎండీఏకు రూ. 1,532.5 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.

10వ నెంబ‌ర్ ప్లాట్‌లో 3.60 ఎక‌రాల భూమి ఉంది. 11వ నెంబ‌ర్ ప్లాట్‌లో 7.53 ఎక‌రాలు, 14వ నెంబ‌ర్ ప్లాట్‌లో 7.34 ఎక‌రాలు ఉంది. గతంలో 2021 జూలైలో నియోపోలిస్ ఫేజ్ 1 వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ. 60 కోట్లను తాకింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,000 కోట్లు సంపాదించింది. ఫేజ్‌ 1లో దాదాపు 49 ఎకరాలు విక్రయించగా.. ఎకరం అప్‌సెట్ ధరను 25 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈరోజు జరిగే వేలం ద్వారా మరో రూ. 2,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.