గణేశ్ నిమజ్జనంపై గత ఏడాది ఉత్తర్వులే కొనసాగుతాయిః హైకోర్టు

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని హుసేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని గత ఏడాది కోర్టు ఉత్తర్వులు

high-court-on-ganesh-nimajjanam-orders

హైదరాబాద్‌ః వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన గణేశ్ విగ్రహాలను హుసేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని గత ఏడాది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది గణేశ్ ఉత్సవాల సందర్భంగా కూడా అవే నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లో నిమజ్జనం చేయాలని హైకోర్టు గత ఏడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నట్లు కోర్టు తెలిపింది. పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని తయారీదారులు గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఈ రోజు విచారణ జరిపింది. పీసీబీ నిబంధనలు కొట్టి వేయాలని పిటిషన్లో కోరారు. అయితే గత ఏడాది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి హుసేన్ సాగర్‌లోనే పలు విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో, ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది.