రుతుపవనాల ఎఫెక్ట్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు

రుతుపవనాల ప్రవేశం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణ లోని పలు జిల్లాల్లో గత రాత్రి భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురవగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి కొన్ని గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి వరద ఉధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. తెల్లవారుజాము నుంచి పలు గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా కేశంపేట మండలం సంగంలో 15.93 సెం.మీ, కందుకూరులో 13.13, ఆమన్‌గల్‌లో 12.68, మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌, వనపర్తిలలో 12 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఆమన్‌గల్‌ మండలంలో మేడిగడ్డ-శంకర్‌కొండ మధ్య కత్వ వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం, దండుమైలారం, కేశంపేట మండలంలోని సంగెం, పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, ఎక్లా్‌సఖాన్‌పేట, అల్వాల, కొత్తపేట, కొనాయపల్లి, సంతాపూర్‌ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలంలో దుందుభి నది పరవళ్లు తొక్కింది. అనేక చోట్ల చెట్ల కొమ్మలు తెగిపడి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్వకుర్తిలో 8.8, కొల్లాపూర్‌లో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉత్తర దక్షిణ ద్రోణి దక్షిణ బీహార్‌ నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌ వరకు తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. రానున్న మూడు రోజుల్లో ఉత్తరకోస్తా, యానం, దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.