తెలంగాణ లో నేటి నుండి భారీ వర్షాలు..

ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచికొడుతుంటే..దక్షిణ భారతదేశంలో మాత్రం ఇప్పటివరకు వరదొచ్చె వర్షం పడలేదు. వర్షాలు పడాలని చెప్పి ప్రజలు గుడుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు తెలిపింది. నేటి నుండి తెలంగాణ లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపి రైతులకు కాస్త ఊపిరి పోసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

అదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, కామారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం నాడు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించగా.. బుధవారం నాడు 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం నాడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇక హైదరబాద్‌లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు.

ఇక హైదరాబాద్‌లో నిన్నటి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టా, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, కొండాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లిలో ఆగకుండా వర్షం కురుస్తోంది. ఇక ఈ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే వర్షం నీరు నిలిచిపోయింది.

ఏపీలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురవనున్నాయి.