తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్: శనివారం నుంచి తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది. అంతవరకు ఉన్న ఉష్ణోగ్రతలు తగ్గి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. శనివారం ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కూడా కురిసింది. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. తమిళనాడు నుంచి ఛత్తీస్ గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిన ప్రభావంతో… తెలంగాణలో ఆది, సోమ వారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు పడనున్నాయన్నారు. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా కరీనంగర్ జిల్లా వెల్దిలో 60, సర్వాయిపేటలో 44.3, హుస్నాబాద్లో 30.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే వాతావరణం అత్యంత చల్లబడటంతో చాలామంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/