80 వేల మంది పోలీసులు ఉన్నారు.. అమృత్ పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు?: హైకోర్టు

ఆపరేషన్ పై స్టేటస్ రిపోర్టు అందజేయాలని పంజాబ్ సర్కారుకు హైకోర్టు ఆదేశం

Has the radical leader Amritpal Singh fled Punjab? Abandoned car, clothes found

చండీగఢ్‌ ః ఖలిస్తానీ లీడర్, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ వ్యవహారంలో పోలీసుల తీరుపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ పై స్టేటస్ రిపోర్టు అందజేయాలని ఆదేశించింది. ‘‘80 వేల మంది పోలీసులు ఉన్నారు. అయినా అమృత్ పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు’’ అని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యమేనని మండిపడింది. అమృత్ పాల్ సింగ్, వారిస్ పంజాబ్ దే సంస్థ సభ్యులకు వ్యతిరేకంగా గత శనివారం పోలీసులు చర్యలు తీసుకోవడం, అమృత్ పాల్ తప్పించుకుపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా 120 మందిని అరెస్టు చేశామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.

మరోవైపు ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ‘‘దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తులనూ మేం విడిచిపెట్టబోం. ఈ రాష్ట్ర ప్రజలు శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నారు’’ అని చెప్పారు. అమృత్ పాల్ సింగ్ ను అరెస్టు చేసేందుకు ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని తెలిపారు.