అన్నం పెట్టె రైతులపై మరోసారి లాఠీఛార్జి..

మరోసారి పోలీసులు రైతులపై లాఠీఛార్జి చేసి వారి రక్తం కళ్ల చూశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కర్నాల్‌ జిల్లాలో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులపై హరియాణా పోలీసులు ఉక్కుపాదం మోపారు. పెద్దవారు..ముసలివారు అని కూడా చూడకుండా రక్తం వచ్చేలా కొట్టారు. ఇందులో 10 మంది అన్నదాతలకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రైతులు రక్తమోడుతున్న దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

శనివారం కర్నాల్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓంప్రకాశ్‌ ధన్కర్‌, పార్టీ సీనియర్‌ నేతలు ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులు వేదిక ప్రాంతానికి చేరుకుని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. కార్యక్రమాన్ని అడ్డుకునే యత్నం చేయడంతో పోలీసులు ఒక్కసారిగా రైతులపై లాఠీఛార్జ్ చేసారు. పోలీసుల తీరుపై సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్రంగా మండిపడింది. లాఠీచార్జిని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. దీంతో రైతు సంఘాల ఆధ్వర్యంలో వేల మంది అన్నదాతలు హరియాణాలోని జాతీయ రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. టోల్‌ప్లాజాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. దీంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.

రైతులపై లాఠీఛార్జిని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఘటనా స్థలంలో రక్తమోడుతున్న రైతు ఫొటోను రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పోస్టు చేశారు. రైతుల రక్తం చిందడంతో.. దేశం సిగ్గుతో తలదించుకుందని పేర్కొన్నారు.