నుహ్ అల్లర్ల కేసు..కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్

న్యూఢిల్లీః హర్యానా లోని నుహ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. జులై 31న హిందూ సంస్థ నిర్వహించిన ఊరేగింపులో నుహ్లో మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యాత్ర అనంతరం చెలరేగిన హింసలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం ఉందని హర్యానా పోలీసులు తెలిపారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నట్లు ఫిరోజ్పూర్ జిర్కా డీఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు.
అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించాకే ఎమ్మెల్యేను నిందితుడిగా పేర్కొన్నట్లు హర్యానా పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా అంతకుముందు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యేకు నుహ్ పోలీసులు రెండుసార్లు సమన్లు పంపారు. అయితే, ఆయన ఇతర కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
మమ్మన్ ఖాన్ ప్రస్తుతం ఫిరోజ్పూర్ జిర్కా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన అరెస్ట్ను ముందే ఊహించిన మమ్మన్ ఖాన్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పంజాబ్- హర్యానా హైకోర్టులో మంగళవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హింస చెలరేగిన రోజున తాను నుహ్లో లేనని, తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని మమ్మన్ ఖాన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే బెయిల్ పిటిషన్పై విచారణ అక్టోబర్ 19న జరగనుంది.