మోడీ ప్రసంగం ఫై టిఆర్ఎస్ నేతలు ఫైర్..

ప్రజా సంకల్ప సభ లో మోడీ ప్రసంగం ఫై టిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నలు సంధించారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయో.. ఇక్కడి నుంచి వెళ్లేలోగా సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. కాగా ప్రజా సంకల్ప సభ లో మోడీ సమాదానాలు చెపుతారని అంత అనుకున్నారు. కానీ మోడీ మాత్రం ఎలాంటి సమాదానాలు చెప్పలేదు. ఈ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి మంజూరు చేసారో తెలిపారు. అంతే తప్ప కొత్తగా ఇస్తున్న హామీలు , కానీ మరోటికాని చెప్పలేదు. దీంతో మోడీ ఫై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రధాని మోడీ జవాబు చెప్పలేదని, అసలు తమకు జవాబుదారీతనమే లేదని నిరూపించుకున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు మండి పడ్డారు. కల్లబొల్లి కబుర్లు, జుమ్లా మాటలు తప్ప విధానమేదీ లేదని తేల్చేశారని #ModiMustAnswer అనే పేరుతో ప్రధాని మోదీపై మండి పడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశ, తెలంగాణ అభివృద్ధికి విధాన నిర్ణయమేదైనా ప్రకటిస్తారని ఆశించామని ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. తెలంగాణకు ప్రధాని మోదీ మొండి చెయ్యి ఇచ్చారన్నారు.
అలాగే రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘అవే జూటా మాటలు – ఆక్రోశపు ప్రసంగాలు తప్ప చేసిందేమీ లేదన్నారు. బీజేపీ దొంగల ముఠా తెలంగాణ మీద పడి అడ్డగోలుగా అరిచి గందరగోళ పరిచే ప్రయత్నం చేసిందిఅని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మీ మేకపోతు గాంభీర్యపు మాటలకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పాలిట శత్రువులే. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారు. దేశాన్ని నీ కార్పొరేట్ మిత్రులకు ధారాదత్తం చేయడాన్ని యావత్ దేశం పక్షాన కేసీఆర్ ప్రశ్నించారు. ఎందుకు సమాధానం చెప్పలేదు..?. కేసిఆర్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతే గద్దె దిగిపో` అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.