మైనార్టీలకు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్
తెలంగాణ సర్కార్ మైనార్టీలకు తీపి కబురు తెలిపింది. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేయబోతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మైనార్టీ ఛైర్మన్ల అభినందన సభలో పాల్గొన్న హరీశ్రావు ఈ శుభవార్త ను తెలిపారు.
బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మైనార్టీలకు ఆర్థిక సాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు. మైనార్టీలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంపై రెండు లేదా మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు.
పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారిని మంత్రులు హరీశ్రావు, మహముద్ అలీ సన్మానించారు. జలవిహార్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.