దక్షిణాదిపై బిజెపిది చిన్నచూపు..బిఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరుః హరీశ్ రావు

తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని ఆగ్రహం

harish rao

కొన్ని పార్టీలు అధ్యక్షుల్ని మార్చినా , ఔట్ డేటెడ్ లీడర్లకు పదవులు కట్టబెట్టినా వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. దక్షిణాదిపై బిజెపి సర్కార్ ది చిన్నచూపు అని, దక్షిణాది రాష్ట్రాలకు బిజెపి ఏమైనా ఇచ్చిందా అంటే అది కేవలం శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ముందుగా కర్ణాటకలో ఇచ్చిన రూ.4వేల పెన్షన్ హామీని అమలు చేయాలని సూచించారు. పటాన్‌చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, ఫ్రీడమ్ పార్కులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణకు బిజెపి, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు.

కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలలో రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, కెసిఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయా? అని నిలదీశారు. ఆ పార్టీలలో ప్రజలు తిరస్కరించిన లీడర్లు, స్క్రాప్ లీడర్లు చేరితే పోయేదేమీలేదన్నారు. బిజెపి, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా బిఆర్ఎస్ గెలుపును ఆపలేరన్నారు. బిఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తోందన్నారు.