స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఎల్ఐసీ
న్యూఢిల్లీ: బీమాతో దేశ ప్రజలకు ధీమా కల్పిస్తున్న మార్కెట్ రారాజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ పొంది రికార్డు సృష్టించిన సౌదీ ఆరామ్కో తరహాలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కూడా ఒక సంచలనమే కానుంది. ఎందుకంటే 60 ఏళ్లకు పైగా బీమా సేవలందిస్తున్న ఈ కార్పొరేషన్ అసలు విలువ ఎంతో ఇప్పుడు పబ్లిక్కు తెలపనుంది. చిన్న పట్టణాల నుంచి పెద్ద సిటీలదాకా ప్రతిచోటా ఎల్ఐసీకి సొంత ఆఫీసులున్నాయి. అలాగే దేశంలో అతిపెద్ద కంపెనీలు, ప్రాజెక్టులలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టింది. ఎకానమిక్ రిఫార్మ్ నేపథ్యంలో 20 పైగా కంపెనీలు జీవిత భీమా మార్కెట్లోకి వచ్చినా మూడొంతుల మార్కెట్ వాటాతో వెలిగిపోతోంది. అలాంటి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కోసం అందరూ ఎదురు చూపులు చూడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే ఎల్ఐసీ ఐపీఓకు ముందు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/