అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకున్న గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/Governor-Arif-Mohammad-Khan-visited-Ram-Mandir-in-Ayodhya.jpg)
అయోధ్యః కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అయోధ్యలోని నూతన రామ మందిరాన్ని సందర్శించారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు. విగ్రహానికి తొలుత నిలబడి ఆపై మోకాళ్లపై కూర్చొని మొక్కుకున్నారు. అనంతరం తలను నేలకు ఆన్చి ప్రణమిల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్ భవన్ కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో షేర్ చేసింది. అందులో రామ్ లల్లా విగ్రహం ముందు కూర్చొని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మొక్కుతుండగా వెనుక నుంచి జై శ్రీరాం నినాదాలు వినిపించాయి.
దర్శనం అనంతరం కేరళ గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ‘జనవరిలో రెండుసార్లు అయోధ్యకు వచ్చాను. ఆ రోజు కలిగిన భావనే ఈ రోజు కూడా కలిగింది. నేను ఎన్నోసార్లు అయోధ్యకు వచ్చాను. అయోధ్య వచ్చి శ్రీరాముడిని దర్శించుకోవడం కేవలం సంతోషకరమే కాదు.. గర్వకారణం కూడా’ అని ఆయన పేర్కొన్నారు.