ఇదే రోజు గోకుల్ చాట్ ఉలిక్కిపడింది
ఇదే రోజు గోకుల్ చాట్ ఉలిక్కిపడింది
సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజు గోకుల్ చాట్ బాంబుల మోతతో ఉలిక్కిపడింది. హైదరాబాద్ వాసులు మరచిపోలేని రోజు ఈరోజు. 2007 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు గోకుల్ చాట్, లుంబిని పార్క్ లో జంట పేలుళ్లు జరిగాయి. రెండు నిమిషాల వ్యవధిలో జరిగిన పేలుళ్లతో ఒక్కసారిగా షాక్కు గురైంది. లుంబినీ పార్క్ లేజర్ షో వద్ద.. కోఠిలోని గోకుల్ చాట్ వద్ద రెండు బాంబులు భారీ శబ్దంతో పేలాయి. ఈ దుర్ఘటనలో 42 మంది అమాయక ప్రజలు మరణించారు.
ఇండియన్ ముజాహిద్ధిన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు కుట్ర పన్నింది. ఈ కేసులో A1గా ఉన్న అనిక్ షఫిక్ సయ్యద్, A 2గా ఉన్న అక్బర్ ఇస్మాయిల్ చౌదరి అనే ఇద్దరు ఉగ్రవాదులకు చర్లపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన తారిఖ్ అంజుమాకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అయితే ఘటన జరిగి 14 ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ దారుణం జరిగి 14 ఏళ్లు గడిచినా నిందితులకు శిక్ష అమలు కాలేదు. ఎంతోమంది అమాయకులను పొట్టనపెట్టుకున్న కిరాతకులు.. ఇంకా జైల్లోనే జీవిస్తున్నారు. మరి వారిని ఎప్పుడు శిక్షిస్తారో చూడాలి.