హైదరాబాద్ వాసులారా..పొరపాటున కూడా ఆ రెస్టారెంట్ కు వెళ్లకండి

హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ అనుభవిస్తున్నారు. సగం జీవితం రోడ్ల ఫైనే గడిచిపోతుంది. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అంత బిజీనే. ఇలాంటి బిజీ టైములో చాలామంది రోడ్ ఫుడ్ ను కోరుకుంటుంటారు. అయితే కస్టమర్ల ఆకలిని కొంతమంది హోటల్ నిర్వాహకులు మరోవిధంగా క్యాష్ చేసుకుంటుంటారు. ఈ తరుణంలో ఓ హోటల్ నిర్వాకం బయటపడింది. రోజుల తరబడి నిల్వ ఉంచిన, పురుగులు, బూజుపట్టిన మాంసం వండి పెడుతూ అడ్డంగా దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే ..

బండ్లగూడ జాగీర్‌ కూడలిలోని పెట్రోలు బంకు పక్కన ‘జస్ట్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌ కోర్టు’ పేరుతో రెస్టారెంట్‌ ఉంది. గత కొద్దీ రోజులుగా ఈ హోటల్ లో ఫుడ్ సరిగా ఉండడం లేదని పిర్యాదు లు వస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం జీహెచ్ఎంసీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌరిశెట్టి మనోహర్‌, స్థానిక టీఆర్ఎస్ నాయకుడు మద్దెల ప్రేంగౌడ్‌, మరికొంతమంది కలిసి రెస్టారెంట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫ్రిజ్‌లో బూజుపట్టిన మటన్, పురుగులు పట్టిన చికెన్‌ కనిపించడంతో షాకయ్యారు. రెండు రోజుల క్రితం తయారుచేసిన బిర్యానీని మళ్లీ వేడి చేసి కస్టమర్లకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఆ పదార్థాలను నాణ్యత పరిశీలన కోసం సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కస్టమర్లకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న హోటల్ నిర్వాహకుడికి రూ.5వేల జరిమానా విధించారు.