కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి ఇకలేరు

కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి (61) గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి ఉమేష్ కత్తి.. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో బాత్‌రూమ్‌లో మంగళవారం రాత్రి స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఉమేష్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక మాట్లాడుతూ.. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి కత్తి ఉమేష్‌కు పల్స్‌ లేదని వైద్యులు తెలిపారన్నారు.

మంత్రి ఉమేశ్ కత్తి మృతి విషయం తెలిసి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిర్ఘాంతపోయారు. అనుభవజ్ఞుడైన డైనమిక్ లీడర్‌ను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమేశ్ మృతి వార్త తెలిసిన వెంటనే ఆయన కేబినెట్ సహచరులు గోవింద్ కర్జోల్, కె.సుధాకర్ సహా పలువురు బీజేపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఉమేశ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంలో ఉమేష్ కత్తి రెండు.. పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తున్నారు. అటవీ, ఆహారం పౌర సరఫరా శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

బెలగావి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులలో ఒకరైన ఉమేష్ కత్తి హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలించారు. ఆయన అంతకుముందు ముఖ్యమంత్రి కావాలనే కోరికను సైతం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రత్యేక ఉత్తర-కర్ణాటక రాష్ట్ర హోదా కోసం తరచుగా వార్తల్లో నిలిచేవారు.

1985లో తన తండ్రి విశ్వనాథ్ కత్తి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో బీజేపీలో చేరడానికి ముందు కత్తి జనతాపార్టీ, జనతాదళ్, జేడీ(యూ), జేడీ(ఎస్)లలో పలు హోదాల్లో పనిచేశారు. గతంలో జేహెచ్ పటేల్, బీఎస్ యడ్యూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్ నేతృత్వంలోని మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఉమేష్ కత్తి మృతదేహాన్ని ఎయిర్ అంబులెన్స్‌లో స్వగృహానికి తరలించనున్నారు. సంకేశ్వరలో మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శన తర్వాత అన్ని ప్రక్రియలు జరుగనున్నాయి. బాగేవాడి బెళగావిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం బొమ్మై తెలిపారు.