నడ్డాతో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత భేటీ
2014 ఎన్నికల్లో వైస్సార్సీపీ తరఫున అరకు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత..ఈరోజు హైదరాబాద్ లో జెపి నడ్డాతో భేటీ అయ్యారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు నడ్డా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్ వచ్చిన జేపీ నడ్డా… శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో బస చేయగా.. కొత్తపల్లి గీత భేటీ అయ్యారు. భర్తతో కలిసి వచ్చిన ఆమెను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్వయంగా జేపీ నడ్డా వద్దకు తీసుకెళ్లారు.
ఆర్డీఓ పోస్టుకు రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చిన గీత… మొదటిసారి ఎంపీగా గెలిచిన కొన్నాళ్లకే పార్టీ పిరాయించింది. ఆ తర్వాత ఏ పార్టీలో కూడా ఉండలేకపోయింది. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. ఒకానొక దశలో ప్రత్యేకంగా పార్టీ పెడదామని తలచిన ఆమె భూ వివాదాలు చుట్టుముట్టడంతో ఆ యత్నాలను విరమించుకున్నారు. తాజాగా బీజేపీ వైపు ఈమె చూస్తుందని, వచ్చే ఎన్నికల నాటికి కాషాయ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకే ఈరోజు నడ్డా తో కలిసినట్లు అంత మాట్లాడుకుంటున్నారు.