బిజెపి ప్రచారానికి నితిన్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రాజకీయ నాయకులనే కాకుండా సినీ స్టార్స్ పై కూడా ఫోకస్ పెట్టింది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. స్టార్ హీరో ఎన్టీఆర్ తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇవాళ్టి పర్యటనలో నడ్డా కూడా నితిన్, మిథాలీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు కూడా వేరు వేరుగా నడ్డాతో భేటీ అయ్యారు.
మోడీ కోసం బీజేపీ తరపున ప్రచారం చేయడానికి సినీ హీరో నితిన్, భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. మోడీ పాలనకు తాము ఫిదా అయ్యామని నితిన్, మిథాలీ రాజ్ చెప్పినట్లు లక్ష్మణ్ తెలిపారు. త్వరలో వారిద్దరూ మోడీని కలుస్తారన్న లక్ష్మన్..ప్రధాని సూచనతోనే నడ్డాను కలిసినట్లు చెప్పారు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ సమావేశంలోనూ రాజకీయాలు చర్చకు వచ్చాయన్నారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ అనంతరం హైదరాబాద్ వచ్చిన జేపీ నడ్డా… శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో బస చేయగా.. బీజేపీ ఆహ్వానం మేరకు హోటల్కు వెళ్లిన నితిన్… నడ్డాతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో నడ్డా, నితిన్లతో పాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు పాల్గొన్నారు.