విజయవంతంగా గగన్యాన్ టీవీ-డీ1 ప్రయోగం
బంగాళాఖాతంలో దిగిన క్రూ మాడ్యూల్
శ్రీహరికోట: ఇస్రో చరిత్ర సృష్టించింది. మనుషులను నింగిలోకి పంపే ప్రయోగంలో సక్సెస్ సాధించింది. గగన్యాన్ మిషన్ లో భాగంగా ఈరోజు జరిగిన టీవీ-డీ1 ఫ్లయిట్ టెస్ట్ విజయవంతమైంది. తొలుత రెండు సార్లు ఈ రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసినా.. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. టీవీ-డీ1 క్రూ మాడ్యూల్ అనుకున్నట్లే నింగిలోకి దూసుకెళ్లి.. ఆ తర్వాత బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. పారాచూట్ల ఆధారంగా మాడ్యూల్ నీటిపై వాలింది. మూడు పారాచూట్ల సాయంతో క్రూ మాడ్యూల్ దిగింది. సముద్రంలో ఉన్న ఇండియన్ నేవీ ఆ మాడ్యూల్ను సేకరించనున్నది.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ 17 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ‘అబార్ట్’ సంకేతం పంపారు. దీంతో రాకెట్ లోని క్రూ ఎస్కేప్ వ్యవస్థ యాక్టివేట్ అయింది. రాకెట్ నుంచి విడివడి పారాచూట్ సాయంతో సముద్రంలో ల్యాండ్ అయింది. ప్రయోగం ఆద్యంతం అనుకున్నట్లుగానే కొనసాగిందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ వివరించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ అభినందనలు తెలిపారు.
కాగా, తొలుత ఈ ప్రయోగాన్ని శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. అయితే, చివరి క్షణంలో సాంకేతిక లోపంతో మిషన్ ఆగిపోయింది. అనంతరం లోపాన్ని గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు దానిని సవరించి షెడ్యూల్ టైమ్ కు రెండు గంటలు ఆలస్యంగా ప్రయోగం నిర్వహించారు. గగన్ యాన్ ప్రాజెక్టులో అనూహ్య పరిస్థితులు ఎదురైతే ప్రయోగాన్ని రద్దు చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ ప్రయోగం లక్ష్యమని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ చెప్పారు.